పసుపు ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు | How Consumption Of Turmeric Can Lead To Lead Poisoning | Sakshi
Sakshi News home page

పసుపు సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

Nov 8 2023 5:03 PM | Updated on Nov 8 2023 7:15 PM

How Consumption Of Turmeric Can Lead To Lead Poisoning  - Sakshi

పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం!

దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డయేరియా డిసీజ్‌ రీసెర్చ్‌ బృందాలు, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది.

ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్‌సేల్‌ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్‌ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్‌ బజార్‌లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది.

దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్‌ ప్రభుత్వం.

ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ.

(చదవండి: 'ప్టోసిస్‌' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement