
పిల్లలను ఇంట్లో భరించలేక హాస్టళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు
తప్పని పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో వదులుతున్న పరిస్థితి
ప్రస్తుతం సాధారణ రెసిడెన్షియల్ స్కూల్కూ ఏడాదికి రూ. ఒకటిన్నర లక్ష పైనే ఫీజు
ఆర్థికంగా కుదేలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఊహించలేం. అలాంటిది ఇటీవల కాలంలో పిల్లలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తారా అని వేచిచూస్తున్న పరిస్థితి. బిడ్డల అల్లరిని తల్లిదండ్రులు నియంత్రించలేక పోతున్నారు. గారాబం కాస్త ఎక్కువ కావడంతో పిడుగుల్లా మారుతున్నారు. ఈ క్రమంలో చేసేది లేక పిల్లల్ని హాస్టళ్లలో వదులుతున్నారు. బాధను దిగమింగుకుని బిడ్డ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.
ఆర్థికంగా భారమైనా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్ ప్రైవేటు స్కూళ్లలో వేస్తున్నారు. తమ తాహత్తుకు మించి ఫీజులున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు తరలిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మధ్య తరగతి, పేద కుటుంబాలే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో 6వ తరగతి నుంచే పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తుండడం ఆర్థికంగా ఆయా కుటుంబాలను చిదిమేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రెసిడెన్షియల్ ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థికి అన్నీ కలిపి రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలకు తక్కువ ఎక్కడా లేదు. డే స్కాలర్ స్కూళ్లలోనూ ఏడాదికి పుస్తకాలతో కలిపి రూ.60 వేల నుంచి రూ.80వేల వరకూ ఉంది. గుడివాడ లాంటి ప్రాంతాలకు రూ.2.50 లక్షలు చెల్లించి పంపిస్తున్న కుటుంబాలూ ఉన్నాయి. ఫీజుల భారం ఇంతలా ఉన్నా.. ఇంట్లో ఉంటే చదవడం లేదని, అప్పు చేసి అయినా హాస్టళ్లలో వేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పదో తరగతిలోపే ఒక్కో విద్యారి్థపై రూ.10 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోతున్నాయి. ఒక రకంగా సామాన్యులను ఈ ఫీజులు కోలుకోలేకుండా చేస్తున్నాయి.
మొబైల్ బంధంతోనే అనర్థాలు..
చిన్నారులు మొబైల్కు బానిసలుగా మారుతుండడం తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నట్లుగా తెలుస్తోంది. నాల్గో తరగతి నుంచే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం, వాళ్లు దాన్ని జీవితంలో భాగం చేసుకోవడం విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. 70 శాతం విద్యార్థులు మొబైల్ వ్యసనంతోనే తల్లిదండ్రులను ఖాతరు చేయడం లేదు. అనంతపురం వేణుగోపాల్నగర్కు చెందిన శ్రీలత ప్రభుత్వ టీచర్. భర్త ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. పిల్లాడు ఇంట్లో చేసే అల్లరి భరించలేక కర్నూలులోని స్కూల్లో వేయాల్సి వచ్చిందని శ్రీలత చెబుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహబూబ్బీ గృహిణి. భర్త పోస్టల్ శాఖలో పనిచేస్తారు. వీరికి ఇద్దరు కొడుకులైతే.. ఇద్దరినీ తిరుపతిలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇంట్లో ఉంటే తమ మాట వినరు కాబట్టి హాస్టల్లో వేశాం అని
దంపతులు తెలిపారు.
హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం
అనంతపురం సాయినగర్లో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నా. ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సెల్ఫోన్ మాయలోనే ఉంటున్నారు. అందుకే మా అక్క పిల్లలతో పాటు బంధువుల పిల్లలనూ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం- మమత, సోదనపల్లి, శింగనమల మండలం
ఖర్చయినా తప్పడం లేదు
నాకు ముగ్గురు పిల్లలు. ఇంట్లో ఉంటే చదవడం లేదు. దీంతో చిన్నప్పటి నుంచే అనంతపురంలో రెసిడెన్షియల్ స్కూల్లో వేశా. ఖర్చయినా వారి బాగు కోసమే హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నా. –బసవ, నేమకల్లు, బొమ్మనహాళ్లి మండలం
పల్లెలో చదివించడం కష్టం
నాకు ఒక అమ్మాయి. అనంతపురంలో హాస్టల్ ఉన్న స్కూల్లో 10 వరకూ చదివించాను. ఇప్పుడు ఇంటర్కు కూడా హాస్టలున్న కళాశాలలోనే వేస్తు న్నాను. పల్లెలో చదివించడం కష్టంగా ఉంది. – సుజాత, పుట్లూరు మండలం