
సమాజం మనకు ఏమి ఇచ్చింది అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ సమాజానికి నేను ఏమిచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కడే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ. పదో, ఇరవైయ్యో కాదు.. ఏకంగా 136 సార్లు రక్తదానం చేసి పరోక్షంగా అనేక మంది ప్రణాలను కాపాడారు. 62 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఆరు నెలలకూ ఓసారి ఇప్పటికీ రక్తదానం చేస్తూనే ఉన్నారు. కేవలం రక్తదానమే కాదు తాను మృతి చెందిన అనంతరం తన శరీరంలో పనికొచ్చే అన్ని అవయవాలు ఇండియన్ ఆర్మీకి దానం చేశారు.
నగరంలోని డీడీ కాలనీలో నివాసం ఉండే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ 1983లో వివేకవరి్ధని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అక్టోబర్ 2, మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొదటి సారి రక్తదానం చేశారు. ఇక అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికీ తన రక్తాన్ని దానం చేస్తున్నారు.
రెడ్క్రాస్ సొసైటీకి, నగరంలో ఏ ఆస్పత్రి నుండి ఫోన్ వచ్చినా వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. యోగేష్ది ఓ నెగెటివ్ కావడంతో రక్తదానం చేసిన ప్రతిసారీ మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు అని వైద్యులు అంటుంటే అందులో కలిగే ఆనందం ఎక్కడా దొరకదని ఆయన అంటున్నారు. ఈయన రక్తదానం చెయ్యడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నిపుతుంటారు.
ప్రముఖుల నుంచి అభినందనలు..
ఇన్నిసార్లు రక్తదానం చేసిన యోగేష్ను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సీని ప్రముఖులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఒక వేదికపై ప్రముఖ హీరో రాంచరణ్ మేము సినిమాల్లో హీరోలమైతే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ్ నిజ జీవితంలో హీరో అని అందరిముందూ పొగడడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు.
పలు అవార్డులు, రికార్డులు..
యోగేష్కు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 16వ ఫిలిప్స్ గాడ్ఫ్రే బ్రేవరీ అవార్డు, క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫిలాసఫీ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్, 17 బంగారు, వెండి, 14 మెరిట్ సర్టిఫికెట్స్, రాజీవ్గాంధీ సమైక్యతా అవార్డు, లయన్ ఇంటర్నేషనల్ అవార్డు, స్వేచ్ఛా భారత్ పురస్కార్తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
(చదవండి: Plane Crash Victims : ఆ భయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదట..!)