600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే! | Do Know Manyamkonda Sri Lakshmi Venkateshwara Swamy Temple | Sakshi
Sakshi News home page

600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!

Apr 3 2025 11:16 AM | Updated on Apr 3 2025 11:28 AM

Do Know Manyamkonda Sri Lakshmi Venkateshwara Swamy Temple

పుణ్యతీర్థం 

తవ్వని కోనేరు,చెక్కని పాదాలు...ఉలి ముట్టని స్వామి

 

కలియుగ వైకుంఠంగా, తెలంగాణ  తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.  

తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్‌నగర్‌ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్‌ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల  పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని   పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం.

 దేవస్థానం చరిత్ర...
పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం    ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. 

కీర్తనలతో ఖ్యాతి... 
అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు.  

నిత్యకల్యాణం.. పచ్చతోరణం...
మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు.  

స్థలపురాణం... 
ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. 

ఎలా వెళ్లాలి..?
బస్సు మార్గం: హైదరాబాద్‌ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్‌ప్రెస్‌ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్‌ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్‌ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్‌లో దిగి మహబూబ్‌నగర్‌ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్‌ లేదా కర్నూల్‌ నుండి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్‌ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఇక్కడ  ఆగుతాయి.

సీజన్‌లో పెళ్లిళ్ల  హోరు...
అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర  ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 

బస...
మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద  ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement