చర్చ
‘ప్రపంచ పర్యావరణ క్షీణతకు, పితృస్వామ్య అధికార వ్యవస్థలకు సంబంధం ఉంది’ అంటూ నటి, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆన్లైన్లో దుమారం లేపాయి.
సోహా అలీ ఖాన్ పాడ్కాస్ట్ ‘ఆల్ అబౌట్ హర్’లో ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ ఆరతి కుమార్ రావుతో కలిసి పాల్గొన్న దియా...
వాతావరణ మార్పుల వల్ల కలిగే గందరగోళానికి పితృస్వామ్య మన స్తత్వం, పురుషులే పూర్తిగా కారణమని పేర్కొన్నారు.
‘మీరు పురుష అహంకారం గురించి చెప్పారు’ అని దియా వ్యాఖ్యలపై స్పందించారు సోహా అలీ ఖాన్.
‘అవును. వాతావరణ మార్పులకు కారణం పురుషులే. ఈ గందరగోళానికి వారే పూర్తిగా బాధ్యులు’ అని తన అభి్రపాయాన్ని సమర్థించుకున్నారు దియా మీర్జా.
‘పితృస్వామ్యం కేవలం పురుషులకు సంబంధించినది కాదు. స్త్రీవాదం కేవలం మహిళలకు సంబంధించింది కాదు. మహిళలూ పితృస్వామ్య వ్యవస్థలను సమర్థించగలరు. పురుషులు స్రీవాద సూత్రాలకు మద్దతు ఇవ్వగలరు’ అన్నారు ఆరతి కుమార్ రావు.
‘వాతావరణ సంబంధిత విపత్తుల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే వర్గాలలో మహిళలు, పిల్లలూ ఉన్నారు’
‘పర్యావరణ పరిరక్షణ, మహిళల హక్కుల కోసం గళమెత్తేవారిని అప్రతిష్టపాలు చేయడానికి, వనరులను విపరీతంగా దోచుకునే వ్యవస్థలు నిరంతరంగా పనిచేస్తున్నాయి’
‘నీటి కొరత, ఆహారభద్రత లేకపోవడంలాంటి సమస్యల ద్వారా బలహీన వర్గాలకు చెందిన మహిళలు, బాలికలు వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రభావాలను మొదటగా ఎదుర్కొంటున్నారు’
‘వాతావరణ సంక్షోభం అనేది గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాలు) సమస్య మాత్రమే కాదు గ్లోబల్ నార్త్ (అభివృద్ధి చెందిన దేశాలు)’ సమస్య కూడా... దియా మీర్జా చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ఆమెను సమర్థించే కామెంట్స్తో పాటు కటువుగా విమర్శించే వ్యాఖ్యలూ కనిపించాయి.
‘దియా మీర్జా చెప్పింది అక్షరాలా నిజం’ అన్నారు కొందరు.
‘పర్యావరణ సమస్య అనేది లింగ భేదానికి అతీతంగా అందరి వల్ల వస్తున్న సమస్య. పర్యావరణ సంక్షోభానికి, పురుషాధిపత్యానికి ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉంది’ అన్నారు మరి కొందరు.


