ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్యాసిఫైయర్ నిత్యం సకింగ్ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ప్యాసిఫైయర్ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది.
రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్ పీస్వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.
ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం.
(చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..)


