‘‘నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్లాం?’’
నాకు పూర్వజన్మకు సంబంధించిన అన్ని విషయాలూ గుర్తున్నాయి..
సురేష్ వర్మ 1983 ఆగస్టు 28న మరణించాడు
టిటూ అంతకు ముందే డిసెంబర్ 1982లో జన్మించాడు
టిటూ శరీరంలోకి సురేష్ వర్మ ఆత్మ పరిశోధకులు అభిప్రాయం
‘‘తాతా! ఆగ్రాలో ఉన్న నా భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను అక్కడకు తీసుకెళ్లు’’ అన్న మాటలు వినేసరికి ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అన్నది యూపీలోని బాద్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు తోరణ్ సింగ్ టిటూ. రెండేళ్ల వయసు నుంచి టిటూ చెబుతున్న మాటలను మొదట్లో పిల్లచేష్టలుగా భావించి పట్టించుకోలేదు. అయితే, నాలుగేళ్లు వచ్చాక ఓ రోజు.. ‘‘నాకు ఆగ్రాలోని సదర్ బజార్లో పెద్ద రేడియో షాప్ ఉంది, పెద్ద బంగళా ఉంది, కార్లు ఉన్నాయి. నా పేరు సురేష్ వర్మ, నేను ‘సురేష్ రేడియో’ అధిపతిని. స్మగ్లింగ్ కూడా చేసేవాడిని. నన్ను తుపాకీతో కాల్చి చంపేశారు’’ అని చెప్పడంతో టిటూ కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.
ఈ సంగతేమిటో తేల్చుకోవాలని టిటూ అన్నయ్య ఆగ్రాలోని సదర్ బజార్కు వెళ్లాడు. అక్కడ ‘సురేష్ రేడియో’ షాప్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ షాప్ యజమాని సురేష్ వర్మను 1983లో ఎవరో కాల్చి చంపేశారని, ప్రస్తుతం అతని భార్య ఉమా వర్మ ఒంటరిగా ఉంటోందని తెలిసి షాక్కు గురయ్యాడు.

విషయం తెలుసుకున్న సురేష్ వర్మ కుటుంబ సభ్యులు టిటూను చూడటానికి వచ్చారు. వారిని చూడగానే టిటూ గుర్తుపట్టాడు. గత జన్మలో తమకు సంబంధించిన బోలెడు విషయాలను ఏకరువు పెట్టాడు. వ్యాపారంలో ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చాడో, ఆ డైరీ ఎక్కడ దాచాడో కూడా చెప్పాడు. అయితే, గత జన్మలోని సురేష్ వర్మ భార్య ఉమ.. టిటూకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఇరవై మంది పిల్లల మధ్యలో తమ ఇద్దరి పిల్లలను కూర్చోబెట్టి గుర్తుపట్టమని అడిగితే, టిటూ ఇద్దరినీ గుర్తించి పేర్లు కూడా చెప్పాడు..
‘‘నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్లాం?’’ అడిగింది ఉమ.
‘‘ఓ తిరునాళ్లకు వెళ్లాం. నువ్వు కారు బానెట్పై కూర్చుని జిలేబీ కూడా తిన్నావు’’ అని టిటూ చెప్పడంతో ఆమె నోరెళ్లబెట్టారు.
టిటూ కుడి కణత భాగంలో ఒక చిన్న గుండ్రటి మచ్చ ఉంది. అలాగే తల వెనుక భాగంలో మరికొన్ని గుర్తులు ఉన్నాయి. సురేష్ వర్మ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, సురేష్ వర్మను కాల్చినప్పుడు బుల్లెట్ కుడి కణత నుంచి లోపలికి వెళ్లి, తల వెనుక భాగం నుంచి బయటకు వచ్చింది. టిటూ ఒంటిపై ఉన్న మచ్చలు సరిగ్గా అవే స్థానాల్లో ఉన్నాయి.
టిటూ మిస్టరీని పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు ఓ చిక్కుముడి ఎదురైంది. రికార్డుల ప్రకారం సురేష్ వర్మ 1983 ఆగస్టు 28న మరణించాడు. కానీ టిటూ అంతకు ముందే డిసెంబర్ 1982లో (కొన్ని రికార్డుల ప్రకారం డిసెంబర్ 1983లో) జన్మించాడు. టిటూ 1983 డిసెంబర్ 12న జన్మించింది నిజమైతే, అప్పటికే సురేష్ వర్మ చనిపోయాడు కాబట్టి ఇది పునర్జన్మ అవుతుంది. ఒకవేళ టిటూ 1982లో జన్మించి ఉంటే, సురేష్ చనిపోయే సమయానికి అతడి వయసు ఎనిమిది నెలలు. అంటే, సురేష్ వర్మ ఆత్మ– టిటూ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉండాలని భావించాలి. ఎందుకంటే టిటూకి సరిగ్గా 8 నెలల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురై చావు అంచుకు వెళ్లాడు. ఆ సమయంలోనే టిటూ శరీరంలోకి సురేష్ వర్మ ఆత్మ ప్రవేశించి ఉండవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ వింత కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటిష్ మ్యాగజైన్ ‘రీఇ¯Œ కార్నేషన్ ఇంటర్నేషనల్’ దీనిపై ప్రత్యేక కథనం రాసింది. బీబీసీ 1990లో ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఇటీవల ప్రసిద్ధ ‘దేశీ క్రైమ్ పాడ్కాస్ట్’ టిటూను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న డాక్టర్ తోరణ్ సింగ్ యోగా, నేచురోపతిలో ఎండీ పూర్తి చేసి, వారణాసిలోని ప్రతిష్ఠాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
"నాకు పూర్వజన్మకు సంబంధించిన అన్ని విషయాలూ గుర్తున్నాయి. షాప్ మూసేసి నా వైట్ ఫియట్ కారులో ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒకడు ‘నమస్తే’ అన్నాడు, ఇంకొకడు నన్ను కాల్చేశాడు. ఆ రోజుల్లో నేను వారితో కలిసి స్మగ్లింగ్ చేసేవాడిని. నన్ను చంపినవాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిదేళ్ల శిక్ష కూడా అనుభవించారు. తొమ్మిదేళ్ల వయసులో వారిని చూసినప్పుడు భయం వేసింది. గత పదేళ్లుగా నా పూర్వజన్మ కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు నాకు భార్య, కొడుకు ఉన్నారు. నేను నా ప్రస్తుత జీవితంలో సంతోషంగా ఉన్నాను." - పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ తోరణ్ సింగ్
సత్యకిశోర్


