పసుపు కొమ్ము గణపతి దీన్నే హరిద్రా గణపతి అంటారు. అష్టోత్తరంలో ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తుంటాం. గురు గ్రహ అనుగ్రహం కోసం హరిద్రా గణపతిని పూజించాలని పండితులు చెబుతుంటారు. గురువు అనుకూలంగా లేనివారు పసుపుకొమ్ము గణపతిని పూజించి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో పసుపు కొమ్ము గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటి? పశువు కొమ్ము కాస్తా పసుపు కొమ్ముగా ఎలా మారింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..?
పూర్వం త్రిపురాసురలనే రాక్షసులుండేవారు. వారు తమను ఏకకాలంలో చంపాలనే వరాన్ని పొంది ఉన్నారు. దాంతో నందీశ్వరుడు ఆ ముగ్గురిని తన త్రిశృంగములతో అంటే మూడు కొమ్ములతో ఏకకాలంగా పైకెత్తగా శివుడు తన త్రిశూలంతో ముగ్గురిని సంహరించాడు. అయితే శివుడి త్రిశూలం ధాటికి నంది మధ్య శృంగం అంటే మధ్యలో ఉండే కొమ్ము ఊడిపోయి, కింద పడిపోయింది. దాన్ని గమనించిన పరమేశ్వరుడు పశువు కొమ్మును పసుపు కొమ్ముగా మారేలా వరమిచ్చి విఘ్నేశ్వర మూర్తి రూపంలో ఆ పసుపు కొమ్ముకు హరిద్రా గణపతిగా పూజలు అందుకునే వరాన్ని ఇచ్చారు.
శుభానిక ప్రతీక..అందుకే హల్దీ..
పసుపు కమ్ము గణపతి శుభానికి ప్రతీక. గురు గ్రహం పసుపు వర్ణానికి అధిపతి. శుభకార్యాల్లో కూడా పసుపు వర్ణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పెళ్లికి ముందు హల్దీ వంటి వేడుకలు.. పసుపు బట్టలతో పెళ్లి పీటలపై వధువరులను కూర్చోబెట్టడం వంటివి ఉదాహరణలు. అర్చనలు ఆధ్యాత్మిక క్రతువుల్లో కూడా పసుపునకు ప్రాధాన్యం ఉంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞాన కారకుడు, సంతాన కారకుడు గురువు అనుగ్రహంతో పాటు గృహ సౌఖ్యం ఆచారాలు మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పసుపు కమ్ము గణపతిని పూజించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. జాతకంలో గురువుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోపల లోపలే విస్తరించే షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇలాంటి వారు పసుపు కమ్ము గణపతిని పూజించాలని పెద్దలు చెబుతున్నారు.
గురుసేవ, గురుపారాయణం..
అయితే గురు గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే దుష్ఫలితాల భారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునే మార్గాలు లేకపోలేదని పెద్దలు చెబుతున్నారు. దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వల్ల బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చని దక్షిణామూర్తిని స్మరించడం వల్ల గురువును శాంతింపచేసి ఆయన ద్వారా ప్రాప్తించే వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతున్నారు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెబుతారు.
వాటిని దానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం గురు ధ్యానం గురు స్మరణ గురుసేవ మాత్రమే గురు గ్రహం అనుగ్రహానికి కారణం అవుతాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల బారి నుంచి దూరంగా ఉంచడానికి గురువు ఒక్కడే కారణమని అందుకోసం హరిద్రా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హరిద్రా గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
ధన కనుక వస్తువాహనాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపు గణపతిని పూజించడం వల్ల దేహం కాంతిమంతంగా మెరుస్తుంది. అంటే చర్మరోగాలు దరిచేరవు. ఒకవేళ చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి నయంవుతాయని చెబుతారు. వ్యాపారులు కూడా ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేయడానికి ఆయా వస్తువులను హరిద్రా గణపతితో తాకించడం మనం ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. రుణ విముక్తికి ధన లాభానికి హరిద్రా గణపతిని పూజించడం చక్కటి మార్గంని పెద్దలు వివరిస్తున్నారు.
(చదవండి: ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??)


