ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? | Who Are Dwarapalakas In Temples? Know About Significance, Types, And Their Role In Hindu Temple Tradition Explained | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??

Jun 17 2026 10:42 AM | Updated on Jun 17 2026 11:01 AM

devotion: who are dwarapalakas why and what their importance temples

సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. గర్భాలయం వెలుపల.. ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులుంటారు. ప్రాచీన ఆలయాల్లో కూడా అందమైన విగ్రహాల రూపంలో ద్వారపాలకులను ప్రతిష్టించారు. అసలు ఆలయాల్లో ద్వారపాలకులెవరు? ప్రధాన దేవతలకు ద్వారపాలకుల అవసరం ఉంటుందా? వైష్ణవ, శైవ, శక్తి ఆలయాల్లో ఎవరెవరు ద్వారపాలకుల బాధ్యతలను నెరవేరుస్తారు? ఈ వివరాలను గురించి సవివరంగా తెలుసుకుందాం..

ఆలయాల్లో గర్భాలయాల వెలుపల విగ్రహాల రూపంలో ఉండే ద్వారపాలకులు కేవలం కావాలివారు అనుకోవడానికి వీళ్లేదు. ఆలయానికి వచ్చే భక్తుడి మానసిక స్థితిని దైవదర్శనానికి అనుగుణంగా మార్చే ఆధ్యాత్మిక సంకేతాలుగా ద్వారపాలకులు నిలుస్తారని పండితులు చెబుతుంటారు. సైన్స్ కూడా.. గర్భాలయం నిర్మాణ శైలి.. గాలిగోపురం వంటివి భక్తుల్లోని నెగటివ్ ఎనర్జీని లాక్కొని.. ఆకాశంలోకి కలిపేసి.. వారిలో పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు దోహదపడే అంశాలుగా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా సరిగ్గా అదే పని చేస్తారని తెలుస్తోంది. భక్తుల చిత్తాన్ని దేవుడిపై ఉండేలా వీరు అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతుంటారు.

ఆలయంలో దేవతను బట్టి..ద్వారపాలకులు..
గర్భాలయంలో ఉండే దేవతలను బట్టి.. ద్వారపాలకులు ఉంటారు. విష్ణు ఆలయాల్లో జయవిజయులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిద్దరూ వైకుంఠంలో మహావిష్ణువుకు ద్వారపాలకులు అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికీ కూడా విష్ణుదేవుడి మాదిరిగా నాలుగు చేతులుంటాయి. శంఖచక్రాలను ధరించి ఉంటారు. ఇక శివాలయాల్లో చూస్తే.. ద్వారపాలకులుగా దిండి, మొండి ఉంటారు. 

వీరిద్దరూ శివుడి ప్రధాన గణాల్లోని మహాకాలుడు, నందికి ప్రతిరూపాలుగా చెబుతారు. దిండి, మొండి.. వీరిద్దరిలో ఒకరు శూలాన్ని, ఢమరుకాన్ని ధరించి ఉంటారు. కొన్ని ఆలయాల్లో ధాత్రి, విధాత్రి అనే పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. వీరిద్దరూ భక్తుల హృదయంలో ఉండే భయాన్ని, భీతిని తొలగించి, వారి చిత్తం శివుడిపైకి మళ్లేలా చూస్తారని పండితులు చెబుతున్నారు. 

ఇక అమ్మవారు, శక్తి ఆలయాల్లో స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. మీరు గమనించవచ్చు.. గర్భాలయంలో ఉండే అమ్మవారు శాంతస్వరూపిణి అయితే.. ద్వారపాలికలు శాంతంగాను.. అమ్మవారు క్రోదం, రౌద్ర స్వరూపిణిగా ఉంటే.. ద్వారపాలికలు ఉగ్రంగా ఉంటారు. అందుకు కారణాలను మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే.. అమ్మవారి స్వరూపాన్ని బట్టి.. ద్వారపాలికలు మారుతుంటారు.

ప్రతీ ఆలయంలో ద్వారపాలకులకు విశిష్ఠత ఉంటుంది. వీరు ఆలయ పవిత్రతను, అనంత శక్తిని కాపాడతారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భక్తులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తిని దర్శించడానికి ముందు.. ద్వారపాలకులకు నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ద్వారపాలకులు అనేది కేవలం శిల్పకళ కోసమో.. అలంకారం కోసమో కాదని, వారి అనుమతితోనే ముందుకు సాగాలని వివరిస్తున్నారు. 

ఆలయాలను నిర్మించిన రాజులు, రాజవంశాలు కూడా ద్వారపాలకుల శిల్పాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవి. గంగైకొండ చోళపురం వంటి చోట్ల.. భారీకాయులైన ద్వారపాలకులు కనిపిస్తారు. పల్లవుల కాలంలో సహజసిద్ధమైన మానవరూపాలకు సారూప్యంగా ఉండే ద్వారపాలకులకు ప్రాధాన్యమిచ్చారు. చాళుక్యుల కాలంలో ద్వారపాలకులకు కూడా అలంకారానికి ప్రాధాన్యతనిచ్చారు. బౌద్ధ, జైన ఆలయాల్లో యక్షుల రూపంలో లేదా ధర్మరక్షకులుగా, సౌమ్యులుగా ద్వారపాలకులు దర్శనమిస్తారు. 

సో.. ద్వారపాలకుల గురించి తెలిసింది కదా?? ఇకపై ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందుగా ద్వారపాలకులకు నమస్కరించాకే.. ప్రధాన దేవతామూర్తిని దర్శించుకోవాలనే విషయాన్ని మర్చిపోవొద్దు. 

(చదవండి: హిమాలయాల నడుమ చల్లని స్వర్గం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement