Sakshi News home page

అనంతగిరి అందాలకు కొత్త సొబగులు

Published Sat, Jan 20 2024 4:05 PM

Best Place to visit in hyderabad Ananthagiri Hills deets inside - Sakshi

వీకెండ్‌ వచ్చిందంటే నగరవాసులు బిజీలైఫ్‌నుంచి ప్రశాంతమైన వాతావరణంలో  పొల్యూషన్‌లేని ప్రదేశంలోకి వెళ్లిపోవాలని ఆరాట పడుతూ  ఉంటారు. అటు అధ్యాత్మికం.. ఇటు ఆహ్లదకరమైన వాతావరణం కలగలిపిన పర్యాటక అందాలకు కేరాఫ్ అడ్రస్.హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న  వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాలోని అనంతగిరి కొండలు ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగిన రోడ్లు, అలిసిన మనుసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచి పిక్నిక్‌ స్పాట్‌ అనంతగిరి కొండలు..

తాజాగా  ఈ పర్యాటక అందాలకు మరిన్ని హంగులు అద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రాజెక్ట్ డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఏకో టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా అటవీ సంపద దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధి చేస్తారు. చెట్లను నరకకుండా.. కొండలను తొలచకుండా ఏకో టూరిజం ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నారు. అడ్వంచరస్ టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్, రోప్ వే వంటివి ఏర్పాటు చేయనున్నారు.  త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ మహానగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి సేదతీరడానికి వస్తుంటారు. వీకెండ్ లో పర్యాటక అందాలను ఎంజాయ్ చేయడానికి బైక్ లపై రయ్... రయ్ మంటూ వచ్చేస్తుంటారు. అనంతగిరి కొండలకు అటు.. ఇటు రెండు సాగు ప్రాజెక్టులు ఉండటం పర్యాటక అభివృద్ధికి మరింత అనుకూలంగా మారింది. ఒక వైపు సర్పన్ పల్లి.. మరోవైపు కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ లు, హోటల్స్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ప్రాజెక్ట్ ల్లో బోటింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి.

అనంతగిరి అభివృద్ధి కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. పెద్దసంఖ్యలో  పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఇక్కడ నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు.  జూ పార్క్ తరహాలో పక్షుల, జంతువుల కోసం 213 ఎకరాలను కేటాయించారు. త్వరలోనే పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది.

అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందవచ్చు. 400 ఏళ్ల  క్రితం హైదరాబాద్ నవాబ్‌ నిర్మించాడట ఈ ఆలయాన్ని. హైదరాబాద్ నవాబు కలలోకి అనంత పద్మనాభస్వామి వచ్చి టెంపుల్ కట్టమని  ఆదేశించడంతో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టారనీ అందుకే  ఈ ప్రదేశానికిఅనంతగిరి కొండలు అని పేరు వచ్చిందని ప్రతీతి.

Image

Advertisement

What’s your opinion

Advertisement