జూన్‌ 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు | Ashada Masam Utsavalu 2025 Indrakeeladri Vijayawada | Sakshi
Sakshi News home page

జూన్‌ 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు

Jun 14 2025 12:46 PM | Updated on Jun 14 2025 3:29 PM

Ashada Masam Utsavalu 2025 Indrakeeladri Vijayawada

26 నుంచి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు 

జూలై 8 నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు 

మూడు రోజులు కాయగూరలు, ఆకుకూరలతో అలంకరణ

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ: ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు, 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి.   

ఆషాఢ మాసోత్సవాలు.. అమ్మవారికి సారె 
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ.  ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా భక్తులు దుర్గమ్మకు సారె సమర్పిస్తారు. నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూలవిరాట్‌ దర్శనానంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. 

గుప్త నవరాత్రులు
ఆషాఢంలో దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు (గుప్త నవరాత్రులు) నిర్వహిస్తారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఆలయ వైదిక కమిటీ, అర్చకులు ఈవోతో చర్చించారు.  

శాకంబరీదేవి ఉత్సవాలు 
ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసే కదంబం ప్రసాదం శాకంబరీదేవి ఉత్సవాల ప్రత్యేకత.  

చదవండి: Today recipes : బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?

వైదిక కమిటీ, అర్చకులతో ఈవో సమీక్ష 
దుర్గగుడిలో ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్‌ శుక్రవారం ఆలయ వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, ఆలయ ఏఈవో, ఫెస్టివల్‌ విభాగంతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థ్ధానంపై ఉందని ఆలయ అధికారులతో పేర్కొన్నారు.  దర్శన వేళలు, రద్దీ సమయాల్లో వ్యవహరించాల్సిన విధానాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వీఐపీ ప్రత్యేక బ్రేక్‌ దర్శన వేళలు వంటి అంశాలను చర్చించారు. సమీక్షలో ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు శ్యావాశ్వ మహర్షి, సీహెచ్‌ ఆంజనేయ ఘనాపాటి,  ప్రధాన అర్చకుడు ఎల్‌. దుర్గాప్రసాద్, ఉప ప్రధానఅర్చకులు కోట ప్రసాద్,   ఏఈవో ఎన్‌. రమేష్‌బాబు, బి. వెంకటరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ గురుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్‌
 

Advertisement
 
Advertisement
Advertisement