
పసిడి ధర భారీగా పెరగడంతో దిగజారిన కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన ఆభరణాల తయారీ పనులు
పనులు లేక అవస్థలు పడుతున్న కార్మికులు
వేరే పనులు చూసుకుంటున్న స్వర్ణకారులు
బంగారం ధర ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు బంగారు ఆభరణాల తయారీ కార్మికులు మాత్రం పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్మికులపై దాని ప్రభావం అధికంగా పడుతోంది.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 40 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో సుమారుగా 50 సముదాయాల్లో ఐదు నుంచి ఆరు వందలకు పైగా, గవర్నర్పేట బీసెంట్రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరో రెండు వందలకు పైగా కార్ఖానాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 25 వేల మంది కారి్మకులు వీటిపై ఆధారపడి ఉన్నారు. ఇవి కాకుండా రెండు జిల్లాలో పెద్ద స్థాయిలో ఆభరణాల తయారీ చేసే మరో వంద వరకూ కార్ఖానాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఏడెనిమిది వేల మంది వరకూ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఆభరణాల తయారీ చేసే వారి సంఖ్య సైతం ఏడెనిమిది వేల వరకూ ఉంటుంది. వీరిలో సుమారు ఏడు నుంచి పది వేల మంది బెంగాల్ కార్మికులు ఉన్నట్లు అంచనా.

పనులు లేక ఆత్మహత్యలు..
పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. యనమలకుదురులో ఒక కార్మికుడు ఆభరణాల తయారీకి వినియోగించే సైనెడ్ను కూల్డ్రింక్లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలకు తరలిపోతున్నారని వారు వాపోతున్నారు.

బహుళజాతి సంస్థలతో తీవ్ర ప్రభావం..
దశాబ్దం క్రితం వరకూ స్వర్ణకారుల (Goldsmith) జీవితాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోయాయి. దాదాపుగా అందరికీ చేతినిండా పనులు ఉండేవి. కానీ పది సంవత్సరాలుగా బహుళజాతి సంస్థల కారణంగా స్థానికంగా పనులు తగ్గి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ముఖ్యంగా చాలా సంస్థలు ఉత్తరాది నుంచి ఆభరణాలను తయారు చేయించు కొని దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తృత ప్రచార ఆర్భాటాలు, ఆకర్షించే దుకాణ సముదాయం, ఆకట్టుకునే రాయితీలు, భారీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి రావటంతో స్వర్ణకారుల బతుకు చిత్రం భారంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి:
రోజూ బంగారం అమ్మకాలు: 250 కిలోలకు పైగా(అంచనా)
ఆభరణాల తయారీ కార్మికులు: 40 వేలు

దారుణంగా కొనుగోళ్లు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిత్యం 250 కిలోల బంగారం అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా.
విజయవాడలో సుమారుగా 25 నుంచి 30 వరకూ కార్పొరేట్ బంగారం అమ్మకాల దుకాణాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో రోజూ దాదాపు
125 నుంచి 150 కిలోల అమ్మకాలు జరుగుతుంటాయన్నది వ్యాపార వర్గాల అంచనా.
విజయవాడతో పాటుగా మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వందల చిన్న దుకాణాలు బంగారం విక్రయాలు చేస్తుంటాయి. వీటిల్లో సుమారుగా మరో 25 నుంచి 40 కిలోల బంగారం విక్రయాలు జరుగుతుంటాయి.
ఇవి కాకుండా విజయవాడలో దాదాపుగా ఏడెనిమిది వందల కార్ఖానాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో సుమారు వంద కిలోల మేర బంగారం నిత్యం వినియోగిస్తుంటారు.
ఇవి సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలు. కానీ బంగారం విక్రయాలు వివాహాల సీజన్, అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజుల్లో మరింత అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ వినియోగం సగానికన్నా పడిపోయిందని వ్యాపార, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
వ్యాపారాలు పడిపోయాయి..
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావంతో వ్యాపారులతో పాటుగా ఆభరణాల తయారీ చేసే కార్మికులు నానా తంటాలు పడుతున్నారు.
– కోన శ్రీహరిసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, బెజవాడ జ్యూవెలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
బంగారు ఆభరణాల తయారీ కారి్మకులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు చేరుకున్నారు. ఇటీవల యనమలకుదురులో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు బంగారం ధరల (Gold Rate) పెరుగుదల ప్రధాన కారణం. చాలా మంది ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కార్మికులలుగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– తోలేటి శ్రీకాంత్, చైర్మన్, వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభాగం
పరిస్థితి దయనీయం..
ఆభరణాల తయారీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తులం బంగారం (Gold) లక్షకు చేరుకోవటంతో ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. పనులు లేకపోవటంతో ఆదాయం లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– మందారపు పోతులూరి ఆచారి, ప్రధాన కార్యదర్శి, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం
ఇదీ చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!