రణధీర శరణార్థులు | Afghanistan's refugee women's cricket team attends World Cup opener | Sakshi
Sakshi News home page

రణధీర శరణార్థులు

Oct 7 2025 12:50 AM | Updated on Oct 7 2025 6:44 AM

Afghanistan's refugee women's cricket team attends World Cup opener

ఫ్యూచర్‌ స్టార్స్‌

గౌహతిలోని బర్స పారా క్రికెట్‌ స్టేడియంలో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్‌ 2025 ప్రారంభ మ్యాచ్‌కు అఫ్గానిస్థాన్‌ శరణార్థ మహిళల క్రికెట్‌ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్, ఇనోకా రణవీర ప్రారంభ ఆటలో అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. అయితే ఆటలోకి అడుగు పెట్టకుండానే అఫ్గాన్‌ మహిళల జట్టు వార్తల్లో నిలిచింది. 

మహిళల హక్కుల కోసం పోరాడి, తాలిబాన్‌ ప్రభుత్వం నుంచి తప్పించుకున్న ఈ అఫ్గాన్‌ మహిళా క్రికెటర్‌ల బృందం ప్రవాసంలో ఉంటుంది. భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకొని అఫ్గానిస్థాన్‌ ప్లేయర్స్‌ వివరాలను ఐసీసీ బయటపెట్టలేదు. రాబోయే రోజుల్లో అఫ్గాన్‌ మహిళల క్రికెట్‌ జట్టును మరింత క్రియాశీలం చేయడానికి వారి పర్యటన తొలి ప్రయత్నంగా భావించాలి. 

అఫ్గానిస్థాన్‌ శరణార్థుల క్రికెట్‌ జట్టుకు భవిష్యత్తులో జరగబోయే రెండు ప్రధాన ప్రపంచ టోర్నమెంట్‌లలో స్థానం కల్పించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత క్రికెట్‌తో సహా ఎన్నో ఆటలపై మహిళలు ఆడకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి  పారిపోయిన అఫ్గాన్‌ మహిళా అథ్లెట్లకు సహాయం చేయడానికి ఐసీసీ చొరవ చూపింది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసీసీఐ), ఇంగ్లండ్‌ అండ్‌ వేల్ఫ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (ఇసీబి), క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఏ) సహకారంతో అఫ్గాన్‌ జట్టును ముందుకు నడిపించడానికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా కీలకంగా వ్యవహరిస్తున్నాడు.చాలామంది శరణార్థ ప్లేయర్స్‌ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. మరికొందరు యూకే, కెనడాలలో నివసిస్తున్నారు. అయితే వీసా సమస్య కారణంగా చాలామంది మన దేశానికి రాలేకపోయారు. ఇక్కడికి వచ్చిన వారు శిక్షణ శిబిరాలలో  పాల్గొంటారు. దేశీయ జట్లతో కొన్ని మ్యాచ్‌లలో పోటీ పడతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement