‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’లో 274 మంది తాలిబన్లు మృతి..
400 మందికి గాయాలు
తాలిబన్ల దాడులను తిప్పికొట్టడానికే రంగంలోకి దిగామన్న పాకిస్తాన్
వివాదాలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని చైనా, రష్యా సూచన
ఇస్లామాబాద్: ఒకప్పటి మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్ సైన్యం గురువారం రాత్రి అఫ్గాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు.
మరో 400 మందికిపైగా గాయపడ్డారు. తాలిబన్లకు చెందిన 27 సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. తొమ్మిది సైనిక పోస్టులను పాక్ సైన్యం స్వా«దీనం చేసుకుంది. అలాగే అఫ్గాన్లో పలు యుద్ధ ట్యాంకులు సైతం ధ్వంసమైనట్లు సమాచారం. తాలిబన్ల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ వైమానిక దాడులు జరిగాయి. సరిహద్దుల్లో తాలిబన్ల దాడులను తిప్పికొట్టడానికే తాము రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు పాక్ తేల్చిచెప్పింది.
అఫ్గాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించామని పాకిస్తాన్ రక్షణ శాఖమంత్రి అసిఫ్ ఖవాజా ప్రకటించారు. తమ ఓపిక పూర్తిగా నశించిందని, రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం సాగుతోందని పేర్కొన్నారు. పొరుగుదేశం గుట్టుమట్లు తమకు తెలుసంటూ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘దమా దమ్ మస్త్ ఖలందర్’అనే సూఫీ ఆధ్యాతి్మక గీతాన్ని సైతం ప్రస్తావించారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తాము చేయాల్సింది చేసి చూపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు.
ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన
పాక్, అఫ్గాన్ మధ్య 2,611 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. దీన్ని డ్యురాండ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సరిహద్దును తాలిబన్లు గుర్తించడం లేదు. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద అఫ్గాన్ దళాల కాల్పుల్లో 55 మంది తమ సైనికులు మృతి చెందినట్లు్ల పాకిస్తాన్ రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగుతున్నారని, తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమ చెక్పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.
పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలను వారికి వివరించారు. పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని ఆయా మంత్రులు స్పష్టంచేశారు. మరోవైపు పాక్–అఫ్గాన్ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తంచేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని చైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరింది.
పాక్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి
అఫ్గాన్ తాలిబన్ల తీరుపై పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రిపూట పిరికిపందల్లా పాక్పై దాడులకు దిగారని మండిపడ్డారు. సాధారణ పౌరులపై కాల్పులు జరిపారని ఆరోపించారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెప్పామని స్పష్టంచేశారు. తమ దేశభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మరోసారి పాక్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లను హెచ్చరించారు.
శాంతి పట్ల ఆకాంక్ష బలహీనత కాదు
పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం స్పందించారు. శాంతి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొనే విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు. తాలిబన్ల దుశ్చర్య పట్ల తమ సైనిక దళాలు సమగ్రంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించాయని తెలిపారు. శాంతి పట్ల తమ ఆకాంక్షను బలహీనతగా భావించవద్దని అఫ్గాన్ పాలకులకు సూచించారు. తమ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ‘అందనంత దూరంలో ఎవరూ లేరు’అంటూ ఉద్ఘాటించారు. ఎలాంటి దాడులైనా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ సైన్యానికి ఉందని తేలి్చచెప్పారు.


