గడ్డకట్టిన మంచుపై పరుగు పందెం..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు | 4 Hyderabad Mens participated half marathon at the Pangong Frozen Lake | Sakshi
Sakshi News home page

ప్రపంచపు ఎత్తయిన ప్రదేశంలో హాఫ్‌ మారథాన్‌..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు

May 6 2025 12:00 PM | Updated on May 6 2025 12:07 PM

4 Hyderabad Mens participated half marathon at the Pangong Frozen Lake

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు? అరుదైన సాహసాలు చేయాలనే తపన ఉండాలే గానీ..అద్భుతాలు సృష్టించవచ్చు.. ఘనమైన ప్రతిభను పొందవచ్చు.. అంటున్నారు హైదరాబాద్‌ నగరానికి చెందిన అడ్వెంచర్‌ టూరిస్టులు. నగరంలో సాహసికులు పెరుగుతున్న కొద్దీ వైవిధ్య భరిత సాహసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో నగరానికి చెందిన నలుగురు భిన్న రంగాలకు చెందిన ఔత్సాహికులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించిన పాంగోంగ్‌ ఫ్రోజెన్‌ లేక్‌లో హాఫ్‌ మారథాన్‌లో పాల్గొని హైదరాబాద్‌ నగరం నుంచి ఆ ఘనతను దక్కించుకున్నారు. 

లద్దాఖ్, ఫిబ్రవరి 24–25, 2025: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌గా ప్రసిద్ధి పొందిన పాంగోంగ్‌ ఫ్రోజెన్‌ సరస్సు మారథాన్‌ ఈ ఏడాది కూడా లద్దాఖ్‌లో ఘనంగా జరిగింది. ఇది కేవలం రన్నింగ్‌ ఈవెంట్‌ మాత్రమే కాకుండా, హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమనీనదాలపై మరియు వాతావరణ మార్పుల ప్రభావంపై చైతన్యాన్ని పెంచే ప్రయత్నం కూడా. 

రన్‌ విశేషాలివీ.. 
హిమాలయాల్లో కరుగుతున్న హిమనీనదాలు, తగ్గుతున్న మంచు సరస్సుల వల్ల భవిష్యత్తు మార్పులపై అవగాహన కల్పించటం కోసం లద్దాఖ్‌లోని పాంగోంగ్‌ సరస్సులో 4,273 మీటర్ల ఎత్తులో 2023లో మొదటిసారి ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో ‘అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌’గా గుర్తింపు పొందింది. 

తాజా రన్‌లో అమెరికా, నేపాల్, కొరియా, ఆ్రస్టేలియా, భారత్‌కు చెందిన అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లు జరగకపోవచ్చని హెచ్చరిస్తూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ నిర్వహించే ఈ మారథాన్‌ను ‘ది లాస్ట్‌ రన్‌’ అని కూడా పిలుస్తారు. 

నగరానికి చెందిన ప్రవీణ్‌ గోయెల్, నవీన్‌ సింకా, బిక్కినా వెంకట రాజేష్‌ రతన్‌ నలుగురూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. అయితే వీరంతా.. సమవయస్కులు కూడా కాదు. అయితేనేం.. అభిరుచి వారిని కలిపింది. ఆత్మవిశ్వాసం వారిని విజయ శిఖరాన నిలిపింది. ‘ఇంట్లో వాళ్లు వద్దనే చెప్పారు. కానీ.. అప్పటికే సైక్లింగ్, రన్నింగ్‌ వంటివి అలవాటయ్యాయి. అందుకే దీన్ని ప్రయత్నించడం భయం అనిపించలేదు’ అని చెప్పారు వ్యాపారి ప్రవీణ్‌గోయెల్‌. 

‘16 డిగ్రీల చలిని పట్టించుకోకుండా కదులుతూ ఉండటానికి చేసిన మానసిక ప్రయత్నం..ఫలించింది. భయాన్ని అధిగమించడానికి సహాయపడింది’ అని భారత నావికాదళంలో అధికారిగా పనిచేసే రతన్‌ (29) చెప్పారు.  ‘గత 15 సంవత్సరాలుగా మారథాన్‌ రన్నర్, బ్యాడ్మింటన్‌ ఆటగాడిగా అనుభవం ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రత్యేకం అంటున్నారు ఐటీ నిపుణులు నవీన్‌ సింకా (45). పరుగులో మా ముఖాలు మొద్దుబారిపోయాయి. మా దగ్గర ఉన్న నీరు కూడా పరుగు మధ్యలో గడ్డకట్టుకుపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. 

‘గ్లోబల్‌ వార్నింగ్‌ కారణంగా, పాంగోంగ్‌ త్వరలో గడ్డకట్టడం ఆగిపోవచ్చు’ అని మరో ఐటీ ప్రొఫెషనల్‌ (50) రాజేష్‌ చెప్పారు. ‘తనకు ఇది వ్యక్తిగత రికార్డ్‌ కన్నా ఎక్కువ అని, ఈ రన్‌లో ఇమిడి ఉన్న సందేశమే తనకు ముఖ్యమని అంటున్నారాయన. లాస్ట్‌ రన్‌ పేరు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ.. దాని వెనుక అంతరార్థం మాత్రం ఆందోళనకరం’ అని చెప్పారు.

విభిన్న నేపథ్యాల నుంచి..
నావికాదళ అధికారి, కార్పొరేట్‌ వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, ఐటీ మారథానర్‌ – వంటి విభిన్న నేపథ్యాలున్నప్పటికీ, ఈ నలుగురూ అవరోధాలను అధిగమించి అనూహ్యమైన రికార్డు సాధించారు. నగరానికి తిరిగి వచ్చిన వారి ప్రయాణం కొత్త లక్ష్యాల దిశగా సాగనుంది. 

ఐరన్‌ మ్యాన్‌ గోవా అనే ఈవెంట్‌పై రతన్‌ తన దృష్టి పెట్టారు. కిలిమంజారోను అధిరోహించాలని నవీన్‌ యోచిస్తుంటే, రాజేష్‌ 6000+ మీటర్ల హిమాలయ శిఖరంపై సూపర్‌ రాండన్నూర్‌ సైక్లింగ్‌ హోదాను గురిపెట్టారు. పాంగోంగ్‌ నుంచి కొత్తగా ప్రేరణ పొందిన ప్రవీణ్‌ మరిన్ని సాహసాలను అన్వేషిస్తున్నారు.

(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement