హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..? | High Court questions State Government over constructions in the lake | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..?

Jun 18 2026 4:09 AM | Updated on Jun 18 2026 4:09 AM

High Court questions State Government over constructions in the lake

చెరువులో నిర్మాణాలు వద్దని మేం ఆదేశిస్తే.. మీరెలా అనుమతులు ఇస్తారు? 

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

తమ ఆదేశాలు అమల్లోనే ఉంటాయని స్పష్టీకరణ 

నర్సీపట్నం మునిసిపాలిటీలోని పెద చెరువులో అక్రమాలు 

చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో స్పీకర్‌ ఆధ్వర్యంలో నిర్మాణాలు 

దీంతో కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే అధికారుల ప్రాధాన్యం

ధర్మాసనానికి విన్నవించిన పొన్నవోలు

సాక్షి,అమరావతి: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా పెద చెరువులో నిర్మాణాలకు ఎలా అనుమతులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణాలు ఆపాలంటూ గతంలో  తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.  ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అసలు నీటి వనరుల్లో నిర్మాణాలు చేయవచ్చా? అన్న అంశంపై ఇరుపక్షాలు  వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది.  తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.  

వాదోపవాదనలు ఇలా... 
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ  ‘కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశాం.  ధర్మాసనం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు.  స్పీకర్‌ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు అవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారు’అని వివరించారు.

కాగా,  వ్యాజ్యంలో అయ్యన్నపాత్రుడి తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి, ఆయనే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు.   పిల్‌ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి.  ఎమ్మెల్యే హోదాలో అయ్యన్నపాత్రుడు కేవలం భూమి పూజలో మాత్రమే పాల్గొన్నారు.  పిల్‌ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement