కొయ్యలగూడెం: ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములను అభివృద్ధి పేరుతో సేకరిస్తూ, వేలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నాలను ప్రజాసంఘాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నాయకులు స్పష్టం చేశారు. బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్నగర్, ఊట్లగూడెం తదితర గ్రామాల మధ్య ప్రభుత్వం చేపట్టదలచిన నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భూసేకరణ కోసం 2013 భూసేకరణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, తక్షణమే గ్రామసభలు నిర్వహించాలని కోరారు. ఉనికి కోసం వ్యవసాయంపైనే ఆధారపడే చిన్న, సన్నకారు రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ఒప్పుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేలాది ఎకరాల నిరుపయోగ అటవీ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, రైతుల భూములను పణంగా పెట్టి ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కాంట్రాక్టు పనుల్లో లబ్ధి పొందేందుకు, నష్టపరిహారం పేరుతో కోట్లాది రూపాయలు కాజేసేందుకే ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం వారితో కలిసి డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రజాసంఘాల నాయకులు హామీ ఇచ్చారు. విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్, ఏఐకేఎంఎస్, ప్రజాసంఘాల సమాఖ్య, ఇఫ్టూ నాయకులు బొగ్గవరపు బాబురావు, ఎస్.రాజశేఖర్, ఎస్.సుందరరావు, కె.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.


