ఇండెంట్ పెట్టాం
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. పరీక్షల వేళ పుస్తకాలు లేకపోవడంతో తమ పిల్లలు ఎలా చదువుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని పుస్తకాలు..
అగమ్యగోచరంగా పరీక్షలు
ఈ నెల 17 నుంచి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (నిర్మాణాత్మక మూల్యాంకనం) పరీక్షలు ప్రారంభమయ్యాయి. 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే, ఇంతవరకు నాలుగో తరగతికి చెందిన గణితం, ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతికి అందలేదు. ప్రస్తుతం గణితం, ఈవీఎస్ సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా ఇస్తున్నప్పటికీ, వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు పాఠశాలలకు సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
నామమాత్రంగానే పంపిణీ
నూజివీడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వీరిలో కేవలం 40 నుంచి 60 మంది విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజుల్లో గణితం పుస్తకాలు అందాయి. ఆ తర్వాత ఒక్క పుస్తకం కూడా రాకపోవడంతో, వందలాది మంది విద్యార్థులు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీయాల్సి వస్తోంది.
అధికారుల ఉదాసీనత
పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాల కోసం ఎంఈఓలు ఇండెంట్ పెట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివేది పేద వర్గాల విద్యార్థులు కావడంతోనే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖ స్పందించి, తక్షణమే పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
నేటికీ 4వ తరగతికి రాని గణితం, ఈవీఎస్ పుస్తకాలు
పుస్తకాలు లేకుండానే ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
మండలంలోని నాలుగో తరగతి విద్యార్థులకు సంబంధించి గణితం, ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు సరిపడా రాలేదు. దీనిపై స్పందించి, పుస్తకాల కోసం ఇండెంట్ పెట్టడంతో పాటు టెక్ట్స్బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందితోనూ మాట్లాడుతున్నాం. త్వరలోనే విద్యార్థులందరికీ పుస్తకాలు అందజేస్తాం.
– సంగెపు జమలయ్య, ఎంఈఓ–2, నూజివీడు మండలం


