ఏలూరు (ఆర్ఆర్పేట): కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో నిర్వహించనున్న జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం స్థానిక కోటదిబ్బ సర్వీస్ రిజర్వాయర్ వద్ద నిర్వహించిన ప్రచారం కార్యక్రమంలో నేతలు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ను వేయాలని, ఈలోగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి మొత్తం 329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 167 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 162 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయి. పరీక్షలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
34 మంది గైర్హాజరు
భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 34 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్కుమార్ తెలిపారు. మొత్తం 450 మంది అభ్యర్థులకుగాను 416 మంది హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆయన వెల్లడించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ రంగంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలో కార్మికులంతా పెద్దఎత్తున పాల్గొనాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి ప్రజలకు, పరిశ్రమలకు సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భీమవరం: మద్యం షాపులు పెంచాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి హెచ్చరించారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సంఘ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన భీమవరం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు కల్లుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లుగీత వృత్తిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ప్రభుత్వం ఆదుకోకపోయినా బ్రతుకుతెరువు కోసం తాటి చెట్లు ఎక్కుతూ జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్టలు కొట్టడం అన్యాయమన్నారు.


