ద్వారకాతిరుమల: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ద్వారకాతిరుమల క్షేత్ర పాలకుడైన శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వారుణానువాక జప కార్యక్రమాల్లో రెండో రోజు గురువారం విశేష పూజలు జరిగాయి. ముందుగా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా, పార్వతీ సమేత శివదేవుడి ఉత్సవ మూర్తులను, వృష్యశృంగ ప్రతిమను ఉంచి వేద పండితులు పూజలను ప్రారంభించారు. పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ గణపతిపూజ, వరుణ జపములు, వారుణానువాక, శతానువాక ,రుద్ర సహిత సహస్రఘట కలశ అభిమంత్రణ, మండప పూజలను నిర్వహించారు. ఆఖరిలో నీరాజన మంత్ర పుష్పములు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ వరుణ జపములు శుక్రవారం ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలతో ముగుస్తాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు.


