కొయ్యలగూడెం: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ, మెట్ట ప్రాంత ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోకి ప్రవేశించింది. బుధవారం రాత్రి మంగపతిదేవీపేట గ్రామంలో రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. తేలే వెంకటేశ్వరరావు, కొండా వీరాస్వామి అనే రైతులు తమ పొలాల్లో పశువులను ఉంచగా, పెద్దపులి దాడి చేసి అందులో ఒక ఆవును సగం తినేసింది. మంగపతిదేవీపేట, ముద్దప్పగూడెం గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ తెలిపారు. తాను, రాజమండ్రి రేంజర్, 60 మందికి పైగా సిబ్బంది కలిసి పెద్దపులికి మత్తుమందు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు వాతావరణ పరిస్థితులు, పరిసర ప్రాంతాల వల్ల ఫలించడం లేదని చెప్పారు. కాగా, పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


