
మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పత్రికలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే వివరణ ఇచ్చి సవరణ కోరాలని.. ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు అని జిల్లా కమిటీ సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వాదులు, మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను ఆకాంక్షించే వారంతా ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీఎస్ సాయిబాబా, గజపతి ప్రసాద్ కోరారు.
ప్రజాస్వామ్యానికి మచ్చ
చింతలపూడి: పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటూ దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఇలాంటి సంఘటనలు చెడు సంప్రదాయానికి బీజం వేస్తాయని ఏపీయుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అజాద్ అన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, జర్నలిస్టులు ఇలాంటి సంఘటనలపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.