రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని, దీనిని నిరసిస్తూ రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆందోళన చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆచంట అనసూయ (గోపాలపురం నియోజకవర్గం) వేర్వేరు చోట్ల ప్రకటించారు. టీడీపీ శ్రేణులు మహిళలపై జరుపుతున్న దారుణాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మహిళలను వివస్త్రలను చేసి దాడులు చేసిన ఘటనలు గుంటూరు, బద్వేలులలో చోటుచేసుకున్నాయని, ఇవి టీడీపీ నాయకుల అఘాయిత్యాలకు పరాకాష్టగా నిలిచాయన్నారు. ఇందుకు ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సూచనల మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


