ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు జారీ చేసిన జీఓ–396ను వెంటనే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా, రాజమహేంద్రవరం దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యాన దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చేపట్టిన పెన్డౌన్ నిరసన మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీర్రెడ్డి, రాజమహేంద్రవరం అధ్యక్ష కార్యదర్శులు కోలా రామచంద్రరావు, బేరి ముత్యాలరెడ్డి మాట్లాడుతూ, జీఓ–396 అమలైతే దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదముంటుందని అన్నారు.
పిడింగొయ్యిలో..
రాజమహేంద్రవరం రూరల్: పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పిడింగొయ్యి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యాన పెన్డౌన్ కొనసాగించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు పోతల శ్రీనివాసరావు, సమ్మెట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేటీకరించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు.


