పెదపూడి: జి.మామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంపై ఏడు గుర్రాల రథం వద్ద గతంలో ఏర్పాటు చేసిన దాతల శిలాఫలకం, పేర్లు తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ నాయకుడు, ప్రముఖ దాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన అన్నయ్య, దివంగత నేత, మాజీ సర్పంచ్ ద్వారంపూడి అమ్మిరెడ్డి సుమారు 11 బిస్కెట్ల బంగారంతో కేజీ బరువుగల బంగారు కిరీటాన్ని తయారు చేయించి సూర్యనారాయణస్వామి మూల విగ్రహానికి అందజేశారన్నారు. తర్వాత 2016–17లో దేవస్థానానికి సంబంధించిన కమిటీ ప్రతినిధులు గోపురం ఎదురుగా ఏడు గుర్రాల మీద సూర్యనారాయణస్వామి ఉండే విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తనను అడిగారన్నారు. ఆ విగ్రహానికి సుమారు రూ.6.50 లక్షలు ఖర్చయ్యిందని, 2018 జనవరి 24న ప్రారంభించామన్నారు. దానిపై విగ్రహ దాత చింతపండు అమ్మిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి అని తన పేరు ముద్రించారన్నారు. అయితే ఆ పేర్లను గత సోమవారం రాత్రి స్థానిక టీడీపీ నేత గోపిరెడ్డి మరో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తొలగించారన్నారు. కొందరు దాతలు వివిధ భవనాలకు ఆర్థిక సాయం అందించి వారి బంధువుల పేర్లు వేయించుకున్నారన్నారు. అయితే గ్రామ పంచాయతీ, ప్రభుత్వ నిధులతో నిర్మించిన రామాలయం వద్ద కాంప్లెక్స్కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన తండ్రి మూలరెడ్డి పేరు ఎలా పెట్టారని ప్రశ్నించారు.
ఫ టీడీపీ నాయకుల చర్యలు దారుణం
ఫ విలేకరులతో ద్వారంపూడి వెంకటరెడ్డి


