సీతానగరం: ప్రసవానికి ఆస్పత్రికి తీసుకువెళుతున్న క్రమంలో 108లో గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. బొబ్బిల్లంకలోని సుబ్బారావుపేటకు చెందిన రేఖకు పురుటి నొప్పులు వస్తున్నాయని బుధవారం ఉదయం 8 గంటలకు 108కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని రేఖను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో కాతేరు దగ్గరలో నొప్పులు తీవ్రమయ్యాయి. పరిస్థితిని గమనించిన ఈఎంటీ ఎన్.సునీత, పైలట్ గణేష్ సమయస్ఫూర్తితో అంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. రేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్న నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇది తొమ్మిదో ప్రసవం
గర్బిణి రేఖకు ఇది తొమ్మిదో ప్రసవం కావడం గమనార్హం. ఆమెకు ఇప్పటికే నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో రెండుసార్లు అబార్షన్ జరిగింది. ఇప్పుడు మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషనంటే తనకు భయమని, అందుకే చేయించుకోలేదని ఆమె 108 సిబ్బందికి తెలిపింది. దీంతో రేఖకు వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపరేషన్ చేయించుకోకపోతే కలిగే నష్టాలను వివరించారు.


