అమలాపురం టౌన్: పెన్షన్ పొందే ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ప్రభుత్వ ఉద్యోగంలో సేవలందించి రిటైరైన వారికి బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇలా ఇవ్వకపోవడం వల్ల జరిగే పెన్షనర్ల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కేవీపీ జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మూడు నాలుగు దశాబ్దాలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ బిక్ష కాదని, అది చట్టబద్ధ హక్కని స్పష్టం చేశారు. పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్, సరెండర్ లీవ్ నగదు బకాయిలు సకాలంలో విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు రాకా చంద్రరావు, బి.చంద్రరావు, జి.అనంతం, బి.బలభద్ర శర్మ, ఎస్వీఎస్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, పి.గోపాలకృష్ణ, కవల కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్


