● మహిళలకు క్షమాపణలు చెప్పాలి
● నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ డిమాండ్
● అమలాపురం పోలీస్ స్టేషన్లో
వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ నేతలు, మహిళలపైన అనుచిత వ్యాఖలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులు శుక్రవారం ఫిర్యాదు చేశాయి. నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ, పార్టీ జోన్ –2 మహిళా విభాగం అధ్యక్షురాలు చింతా అనురాధ, పార్టీ నాయకులు పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట పినిపే శ్రీకాంత్ విలేకర్లతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ చంద్రబాబుకు రాధాకృష్ణ కొమ్ము కాస్తూ వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు సిగ్గు లేకుండా జర్నలిజం విలువలు మరిచి రోత రాతలు రాస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ తక్షణమే ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్పైన, పార్టీ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను వదిలే ప్రసక్తే లేదని, ఆయనకు మానసిక శిక్ష వేసే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి బాబి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, అమలాపురం పట్టణం, రూరల్, ఉప్పలగుప్తం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, బద్రి బాబ్జీ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు గొవ్వాల రాజేష్, ఉండ్రు బాబ్జీ, మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్దుల్ ఖాదర్, వంగా గిరజాకుమారి, చొల్లంగి సుబ్బిరామ్, ఉండ్రు వెంకటేష్, తిరుకోటి సతీష్, సుంకర లక్ష్మి, విత్తనాల మూర్తి, సూదా గణపతి, పొగాకు శ్రీను, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


