● జిల్లాలో 36 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
● ఏప్రిల్ మొదటి వారంలోనే ఉడుకు
ఐ.పోలవరం: మార్తాండుడు మనుషుల్ని మిడతల్లా వేయించేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వర్షం పడిన తరువాత నుంచి ఎండలు మరింత ముదిరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అమలాపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదు కాగా, రామచంద్రపురంలో 37 నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంది. రెండు రోజులుగా జిల్లాలో రెండు నుంచి మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం అధికంగా ఉండడంతో రాత్రి వేళ జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐ.పోలవరం, తాళ్లరేవు, ముమ్మిడివరం, అమలాపురం బైపాస్ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉక్కపోతలకు తోడు విద్యుత్ కోతలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం చూపుతాయని, రబీ సాగు ఆలస్యమైన చోట తరచూ తడులు అందించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు కొబ్బరి, అరటి, కోకో, కూరగాయ తోటలకు తడులు పెంచాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇదే సమయంలో మోటార్ల సౌకర్యం లేక డెల్టా కాలువల మీద ఉద్యాన పంటలకు నీరందించే రైతులు డీజిల్ మోటార్లపై ఆధారపడుతున్నారు.


