
చిత్తూరు: చిత్తూరులోని మసీదు మిట్టలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. అయితే అది పరువు హత్య అని భర్త సాయి తేజ్ ఆరోపిస్తున్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతోనే చంపేశారని భర్త అంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం యాస్మిన్ భాను, సాయి తేజ్ లు పెళ్లి చేసుకున్నారు. పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజ్ నాలుగేళ్లగా యాస్మిన్ భానుతో ప్రేమలో ఉన్నాడు. వీరు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అనంతంర ఫిబ్రవరి 13వ తేదీన తమకు రక్షణ కావాలంటూ తిరుపతి ముత్యాలరెడ్డి పలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అప్పట్నుంచీ యాస్మిన్ భానును ఫోన్ లో సంప్రదిస్తున్నారు తల్లిదండ్రులు.
ఇదిలా ఉంటే, యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని తమ కూతుర్ని ఒకసారి పంపించాలని సాయి తేజ్ ను కోరారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరు తీసుకు రాగా, అక్కడ నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లాడు యాస్మిన్ సోదరుడు లాలు. అయితే యాస్మిన్ భాను పుట్టింట్లో చనిపోయింది. ఈ విషయం సాయి తేజ్ కు తెలియడంతో ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.