విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌  | Wife Kidnapped Her Husband With Lover In Hyderabad | Sakshi
Sakshi News home page

విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌ 

Sep 29 2021 4:41 AM | Updated on Sep 29 2021 10:33 AM

Wife Kidnapped Her Husband With Lover In Hyderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్‌ చేయించింది. మూడు గంటల్లో కేసును ఛేదించిన మార్కెట్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 2012 సంవత్సరంలో మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌ వాజీద్, అప్షియా బేగం(24)లకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. షేక్‌ వాజీద్‌ (31) బస్టాప్‌ ప్రాంతంలోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అప్షియాబేగం సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటంతో ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్‌ నిర్వ హించే ఆసిఫ్‌ పరిచయం అయ్యాడు. ఆయనకు గతంలో రెండుసార్లు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు.

ఏప్రిల్‌ నెలలో ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా ప్రియుడి దగ్గరకు వెళ్లిపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని భర్తకు అప్పగించారు.  

మరోమారు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. అత్తామామల సహాయంతో భర్త ప్రియుడి వద్ద ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. తన భర్త నుంచి శాశ్వతంగా విడిపోవాలనే ఉద్దేశ్యంతో పలుమార్లు విడాకుల కోసం భర్తపై ఒత్తిడి తెచ్చింది. పిల్లలు ఉండటంతో విడాకులు ఇచ్చేందుకు భర్త అంగీకరించ లేదు. దీంతో అప్షియా బేగం ఎలాగైనా ప్రియుడిని పెళ్లి చేసుకుని అతడితో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది.

విడాకులు ఇచ్చేందుకు భర్త ఒప్పుకోకపోవడంతో ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ కలిసి భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కిడ్నాప్‌ పథకాన్ని రచించారు. ముషీరాబాద్‌లో ఖాజీ ఎదుట విడాకుల కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా షేక్‌ వాజీద్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ముషీరాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ అహ్మద్‌(31), పార్శీగుట్టకు చెందిన జాఫర్‌(33), ఇర్ఫాన్‌ అహ్మద్, మహమూద్‌లను ఆసిఫ్‌ సిద్ధం చేశాడు.

సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ నలుగురు కలిసి 31 బస్టాప్‌ వద్ద చెప్పుల దుకాణంలో ఉన్న షేక్‌ వాజీద్‌ను బలవంతంగా ద్విచక్ర వాహ
నాలపై కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. వాజీద్‌ను ముషీరాబాద్‌కు తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టి విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. 

3 గంటల్లోనే.. 
వాజీద్‌ సాయంత్రం 6గంటల సమయంలో కిడ్నాప్‌నకు గురికాగా 8గంటల సమయంలో షాపు యజమాని మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాప్‌ తీరును పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాధితుడి సెల్‌ఫోన్‌ టవర్‌ను ఆధారంగా వాజీద్‌ను  బంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ముషీరాబాద్‌లో వాజీద్‌ను గుర్తించి రక్షించారు. అప్షియాతో పాటు ఇమ్రాన్‌ అహ్మద్, జాఫర్‌ను పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు ఆసిఫ్‌తో పాటు ఇర్ఫాన్‌ అహ్మద్, మహమూద్‌ పరారీలో ఉన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement