ప్రేమానురాగాలు మరిచి..అయినవారినే హతమార్చి..  

Three Of Same Family Were Brutally Assassinated In Proddatur - Sakshi

ప్రొద్దుటూరులో తల్లి, చెల్లి, తమ్ముడిని హతమార్చిన ఉన్మాది

గర్భిణీ అయిన సోదరిపై కనికరం చూపని కసాయి

సంచలనం కలిగించిన మూడు హత్యలు

నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి అని కూడా చూడలేదు.. తన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క సోదరి పట్ల కనికరం చూపలేదు.. కలిసి పెరిగిన సోదరుడిపై కాస్తంత ప్రేమ చూపించలేదు. సైకో అవతారం ఎత్తిన అతను కన్న తల్లిని.. తోడబుట్టిన చెల్లిని.. తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. బంధాలను మరచిన అతను క్షణాల వ్యవధిలో ముగ్గురినీ రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రొద్దుటూరులో సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్‌ జిల్లా): ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న హైదర్‌ఖాన్‌ వీధిలో గుల్జార్‌బేగం (51), కరీమున్నీసా(27), మహమ్మద్‌రఫి (23) దారుణ హత్యకు గురయ్యారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కుమారులు, కరీమున్నీసా అనే కుమార్తె ఉన్నారు. అతను బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండగా మిగతా ఇద్దరూ బీరువాల తయారీ పని చేస్తుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.

మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే బాడుగకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కుమార్తె కరీమున్నీసాకు భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కరీముల్లా కొన్ని రోజుల నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని పిలిచి మందలించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం హైదర్‌ఖాన్‌ పక్కనే ఉన్న వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కుమార్తె ఉంది. వేరుకాపురం పెట్టిన నాటి నుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు భార్యను నిలదీశాడు. ‘మీ వాళ్లు కావాలనే నాపై నిందలు వేస్తున్నారు.. వాళ్లు నీకు చేతబడి చేసి ఉంటారు’ అని చెప్పింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతున్నాడు.  అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి.

నాకు సుఖం లేనప్పుడు మిమ్మల్ని బతకనీయను..  
తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనని కరీముల్లా ఎప్పుడూ చెప్పేవాడు. అయినా అతని మాటలను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.చెప్పినట్లు గానే తల్లి,చెల్లి, తమ్ముడిని  హతమార్చాడు.

నా కుమారుడ్ని ఉరి తీయండి సార్‌.. 
అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని చంపినఆ రాక్షసుడు   భూమ్మీద ఉండొద్దు.. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. వాడిని ఉరి తీయండి’అంటూ తండ్రి చాంద్‌బాషా రోదించ సాగాడు.

నా భార్య ఏ పాపం చేసింది..
కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. 3 నెలల నుంచి అమ్మగారింట్లోనే ఉంటోంది. 2రోజుల క్రితం భర్త రహీముల్లా అత్తగారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. కొన్ని రోజులుండి పంపుతామని  కరిమున్నీసా తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలోనే  అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయింది.  ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. అంటూ అతను రోదిస్తున్నాడు.    

చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం 
సాక్షి ఎఫెక్ట్‌: అక్రమాల కోటలు కూలుతున్నాయ్‌..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top