నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి..

Thief Arrested In Anantapur - Sakshi

అనంతపురం క్రైం: మహిళ మెడలోని తాళి కొట్టేసిన ఓ దొంగ చివరకు అందరి ముందు ఎగతాళి అయ్యాడు. వివరాలు... అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో గురువారం ఉదయం గౌతమి అనే మహిళ తన ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అపరిచిత వ్యక్తి పలకరించాడు. మాటల్లో ఆమె దృష్టిని మళ్లించి మెడలోని బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని ఉడాయించాడు.

చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి

హడావుడిలో అపరిచిత వ్యక్తి జేబులో నుంచి పర్స్‌ కిందపడిపోయింది. అప్పటికే మహిళ కేకలు విన్న జనం అటుగా వస్తుండడం గమనించిన దొంగ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత దొంగలించిన నగ గిల్టుదని గ్రహించిన అతను.. దానిని తిరిగి మహిళకు అప్పగించి తన పర్స్‌ తీసుకెళ్లేందుకు వచ్చాడు. అప్పటికే పోగైన జనం.. దొంగను గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారణలో వేణుగోపాలనగర్‌కు చెందిన వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top