కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గజదొంగ | Thief Arrested The Accused In 99 Robbery Cases In Hyderabad | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గజదొంగ

Feb 16 2021 9:35 AM | Updated on Feb 16 2021 12:48 PM

Thief Arrested The Accused In 99 Robbery Cases In Hyderabad - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు  

పరారీలో ఉన్న నిందితుడి ఫోటోను పట్టుకొని గాలింపు మొదలుపెట్టిన కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం విశ్వసనీయ సమాచారంతో నగరంలోని ఎల్లారెడ్డి గూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

కేపీహెచ్‌బీకాలనీ: రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ గజ దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 95 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు, సిఐ లక్ష్మీనారాయణలు వివరాలను వెల్లడించారు.  

ఎల్లారెడ్డిగూడకు చెందిన మొహమ్మద్‌ ఇబ్రహీం సిద్ధికి (58) మొదట్లో అన్ని రకాల చోరీలు చేసేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా జల్సాలకు అలవాటు పడ్డాడు.  

హైదరాబాద్‌ నగరంతో పాటు సైబరాబాద్, సంగారెడ్డి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి 87 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన సిద్ధికి 2018లో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీ కేసులో అరెస్ట్‌ అయి పీడీ యాక్ట్‌ నమోదు చేయగా జైలుకు వెళ్లి 2019లో బయటకు వచ్చాడు. 

 జైలు నుంచి బయటకు వచ్చిన ఇబ్రహీం సిద్దికి తన మకాంను నగరం నుంచి బీదర్‌కు మార్చాడు.  వారాంతాల్లో బీదర్‌ నుంచి బస్సులో, లారీలో నగరానికి వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు.


వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు,  ఏసీపీ ఏసిపి సురేందర్‌రావు  

 రాత్రి వేళలో ఇనుపరాడ్లు, బండరాళ్లతో తాళాలు పగుల గొట్టి ఇంట్లోని బీరువా, కప్‌బోర్డ్‌లలో ఉన్న నగదు, బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాలను దోచుకొని పారిపోతాడు.

  కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎనిమిది, చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు, పటాన్‌ చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడగా 12 కేసులు నమోదయ్యాయి. అన్నిచోట్ల కలిపి మొత్తం 99 కేసులు ఇతనిపై నమోదయ్యాయి. 

  పరారీలో ఉన్న నిందితుడి ఫోటోను పట్టుకొని గాలింపు మొదలుపెట్టిన కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం విశ్వసనీయ సమాచారంతో నగరంలోని ఎల్లారెడ్డి గూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

  పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి సుమారు  రూ.10.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. 

 దొంగను అరెస్టు చేసి, చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న కేపీహెచ్‌బీ క్రైమ్‌ విభాగం అధికారులు సిబ్బందిని డిసిపి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు.  

చదవండి:  ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం
చదవండి: 3 కి.మీ వెంటాడి.. చివరకు సాధించాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement