Tamil Nadu: Murder Case Accused Appear In Court Arrested By Special Branch Police - Sakshi
Sakshi News home page

కోర్టుకు వచ్చిన నిందితుడిని లాక్కెళ్లిన పోలీసులు

Jun 17 2023 1:03 PM | Updated on Jun 17 2023 1:37 PM

Tamil Nadu: Murder Case Accused Appear In Court Arrested By Special Branch Police - Sakshi

తిరువళ్లూరు(చెన్నై): కోర్టుకు హాజరైన హత్య కేసు నిందితుడిని స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు లాక్కెళ్లిన సంఘటన తిరువళ్లూరు కోర్టు ఆవరణలో ఉద్రిక్తతకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌కు చెందిన విజయన్‌ కుమారుడు తమిళ్‌సెల్వన్‌(24) పెయింటర్‌. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన రియల్టర్‌ మహేంద్రన్‌కు మధ్య 2020లో ఘర్షణ జరిగి మహేంద్రన్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసు విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో జరుగుతోంది. కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి సత్యనారాయణన్‌ తమిళ్‌సెల్వన్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

న్యాయవాది రాజశేఖర్‌ సహకారంతో శుక్రవారం తమిళ్‌సెల్వన్‌ కోర్టుకు హాజరై అనారోగ్యం కారణంగా రాలేకపోయానని, తనకు విధించిన అరెస్టు వారెంట్‌ను రీకాల్‌ చేయాలని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. సాయంత్రం ఐదు గంటలకు తీర్పు రావాల్సి వుంది. ఇదే సమయంలో టీ తాగడానికి ఆనస్ట్‌రాజ్‌, వినోద్‌కుమార్‌ న్యాయవాదులతో కలిసి కోర్టు నుంచి బయటకు వచ్చిన తమిళ్‌సెల్వన్‌ను పది మంది స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అయితే న్యాయవాదులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అయితే న్యాయవాదులను పక్కకు నెట్టేసి తమిళ్‌సెల్వన్‌ను వాహనంలో ఎక్కించుకుని పోలీసులు వెళ్లిపోయారు. కాగా కోర్టుకు హాజరుకావడానికి వచ్చిన హత్య కేసు నిందితుడిని స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు లాక్కెళ్లిన సంఘటన కోర్టు ఆవరణంలో కలకలం రేపింది. ఈ సంఘటనపై న్యాయవాదులు వినోద్‌కుమార్‌, ఆనస్ట్‌రాజ్‌ తిరువళ్లూరు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: 'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలు'

Advertisement
 
Advertisement
Advertisement