కస్టడీ డెత్‌ కేసు: కరోనాతో ఎస్‌ఎస్‌ఐ మృతి | Tamil Nadu Custodial Death Case Accused Cop Deceased Of Covid 19 | Sakshi
Sakshi News home page

కస్టడీ డెత్‌ కేసులో అరెస్టు.. ఎస్‌ఎస్‌ఐ మృతి

Aug 10 2020 10:34 AM | Updated on Aug 10 2020 10:38 AM

Tamil Nadu Custodial Death Case Accused Cop Deceased Of Covid 19 - Sakshi

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌ కేసులో అరెస్టైన స్పెషల్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పాల్‌దురై కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో పాల్‌దురై మరణించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని  మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సరైన చికిత్స అందించనందు వల్లే పాల్‌దురై మృతి చెందారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు)

ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్‌(59), బెనిక్స్‌(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. చిత్ర హింసలు పెట్టగా వారు మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్‌ కేసులో  సత్తాన్‌కులం పోలీస్‌ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. వీరిలో పాల్‌దురై కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement