సుంకరిపేట ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విజయనగరం: జిల్లాలోని సుంకరిపేట వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం ఘటనపై సీఎం జగన్ ఆరా
విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురైనట్టుగా ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. లారీ ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.