Hyderabad: Road Accident Innova Car Hits Bike, Two Pizza Delivery Boys Died In Medchal - Sakshi
Sakshi News home page

Medchal: ఇన్నోవా కారు బీభత్సం.. పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతుండగా..

Published Sat, Feb 25 2023 9:10 AM

Road Accident Innova Car Hits Bike Two Died Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన సంఘటన మేడ్చల్‌ పట్టణంలోని 44 నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి  తూప్రాన్‌ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగం కారణంగా అదుపుతప్పి ఏజీఎస్‌ వెంచర్‌ సమీపంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొని ఎదురు రోడ్డులోకి దూసుకెళ్లింది.

అదే సమయంలో మేడ్చల్‌ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్న రెండు బైక్‌లను, అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో  బైక్‌పై వెళుతున్న సాయితేజ(19), సాయికిశోర్‌(20) అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికిశోర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో బైక్‌ పై వెళ్తున్న దంపతులు బందెల రవి, మమత వారి కుమార్తె యోగితతో పాటు అశోక్‌ లేలాండ్‌ వాహన డ్రైవర్‌ హరిచంద్‌కు గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ నర్సింహారెడ్డి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

పిజ్జా డెలివరీ చేసేందుకు వెళుతూ... 
దుండిగల్‌ మండలం, బహదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సాయితేజ స్నేహితులు. పిజ్జా హంట్‌లో పనిచేస్తున్న వీరు ఇరువురు  శుక్రవారం పిజ్జాలు డెలివరీ చేసేందుకు కొంపల్లివైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు  డివైడర్‌ అవతలి వైపు వెళ్తున్న వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయితేజకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిశోర్‌ను స్థానిక మెడినోవా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement