చిన్నపాటి గొడవ..పూలు కట్‌ చేసే బ్లేడ్‌తో యువకుడిని..

Petty Quarrel Between Three Youths Led Killed Of Youth - Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: ముగ్గురు యువకుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసిన సంఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ఓల్డ్‌ గాస్మండికి చెందిన భూక్యా శివాజీ అలియాస్‌ శివ (25) కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి పక్కన ఉండే వారి పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో సైనిక్‌పురికి చెందిన తన స్నేహితుడు మింటు అలియాస్‌ డేనియల్‌తో కలిసి ఇంటి సమీపంలో మద్యం సేవిస్తున్నారు.

అదే సమయంలో అటుగా వెళుతున్న గుర్తు తెలియని యువకుడిని ఆపి ఎవరు, ఇక్కడేమి చేస్తున్నావంటూ ప్రశ్నించడమేగాక అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో సదరు యువకుడు తన స్నేహితుడికి ఫోన్‌ చేసి తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోయిందని ఓల్డ్‌ గాస్మండికి రావాలని సూచించాడు. దీంతో మరో యువకుడు కారులో అక్కడికి వచ్చాడు. అయితే శివాజీ మరోమారు వారితో గొడవ పడ్డాడు.

దీంతో అతను తన చేతిలో ఉన్న పువ్వులు కట్‌ చేసే బ్లేడుతో శివాజీపై దాడి చేసి కారులో పరారయ్యాడు. దీంతో శివాజీ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న శివాజీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉండటంతో మార్చురీకి తరలించారు. శివాజీ స్నేహితుడు డేనియల్‌ ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు.  

పోలీసుల అదుపులో నిందితులు ? 
యువకుడిని హత్య చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని  బన్సీలాల్‌పేట్‌కు చెందిన పూల వ్యాపారిగా గుర్తించారు. కారు ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.   

(చదవండి: కారుతో తొక్కించి.. దారుణంగా హతమార్చి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top