Mumbai: నేను వెళ్లిపోతున్నా ఎప్పటికీ తిరిగిరాను అని మెసేజ్.. లవర్‌తో కలిసి కొండపై నుంచి దూకి..

Parents Denied Marriage Mumbai Couple Jumps Off Hill Top - Sakshi

ముంబై: ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. కలిసి జీవిద్దామనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. అయితే వారు మాత్రం వీరి పెళ్లికి  అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమ జంట.. కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో కలిసి జీవించలేకపోతున్నామని చావులో ఒక్కటైంది. మహారాష్ట్ర ముంబైలోని కందివాలి ఈస్ట్ జనుపాద ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఆకాశ్ ఝాటె కాగా.. అతడు ప్రేమించిన అమ్మాయి 16 ఏళ్ల విద్యార్థిని.

ఆకాశ్ హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రోజు నేను వెళ్లిపోతున్నా.. ఎప్పటికీ తిరిగిరాను అని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టాడు. అదే రోజు అతని ప్రేయసి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే ఆ తర్వాత కొన్నిగంటలకే సమతా నగర్ ప్రాంతంలోని ఓ కొండపై నుంచి దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా.. ఈ ప్రేమ జంటే విగతజీవులుగా కన్పించారు. దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: సుమేధా శర్మ హత్య.. విషమంగా ప్రియుడి పరిస్థితి?.. బజరంగ్ దళ్ నిరసనలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top