కందనూలు (తిమ్మాజిపేట): అల్లుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఎస్ఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు భార్యాభర్తలు.
అయితే అలివేలు తమ సొంత అల్లుడు ఆంజనేయులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గుర్తించిన యాదయ్య భార్యతో తరచూ గొడవపడేవారు. అయితే ఈ నెల 23న సాయంత్రం యాదయ్య ఇంట్లో మృతిచెందాడు. అనారోగ్యంతో తన భర్త మృతిచెందాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు చేసే సమయంలో శవానికి స్నానం చేయించడానికి దుస్తులు మారుస్తుండగా గాయాలు ఉండటంతో మృతుడి అన్న కుమారుడు పరశురాములు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకుంది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై దాడి చేసి చంపినట్లు అంగీకరించిందని పేర్కొన్నారు. అలాగే కూతురు, అల్లుడు సైతం అదే రోజు ఇంటికి వచ్చి వెళ్లడంపై అనుమానం ఉందని పరశురాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


