గో కార్టింగ్‌ ప్రమాదంపై కేసు నమోదు

Gurram Guda Hasten Go Karting Zone B Tech Student Succumbed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాస్టన్‌ గో కార్టింగ్‌ ప్లే జోన్‌ నిర్వాహకులపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత బుధవారం సాయంత్రం గో కార్టింగ్‌ రైడింగ్‌ చేస్తూ బీటెక్‌ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైడింగ్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైన శ్రీవర్షిణి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో శ్రీ వర్షిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవనుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. 

వెంట్రుకలు చిక్కుకోవడంతో
గో కార్టింగ్‌ రైడ్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్‌ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టెన్‌ గో-కార్టింగ్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అయితే, సెల్ఫీ కోసం  శ్రీ వర్షిణి హెల్మెట్‌ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్‌ వీల్‌లో చిక్కుకున్నాయని,  ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్‌ గో కార్టింగ్‌ జోన్‌ నిర్వాహకులు చెప్తున్నారు. 
(చదవండి: గో కార్టింగ్‌ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top