భయానక వాతావరణం సృష్టించేందుకే.. | Greenfield camp office set ablaze by miscreants | Sakshi
Sakshi News home page

భయానక వాతావరణం సృష్టించేందుకే..

Jul 8 2024 5:22 AM | Updated on Jul 8 2024 5:22 AM

Greenfield camp office set ablaze by miscreants

కాంట్రాక్టర్‌ సగం పనులు ఇస్తానన్నా మొత్తం కావాలని టీడీపీ నాయకుల డిమాండ్‌ 

ఒత్తిడి తెచ్చినా అంగీకరించని కాంట్రాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి  

గ్రీన్‌ఫీల్డ్‌ క్యాంపు ఆఫీసును తగులబెట్టిన దుండగులు  

సాక్షి టాస్‌్కఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. 

ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్‌ కాంట్రాక్ట్‌ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. 

అయినా కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్‌చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్‌ తెలిపారు. 

కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement