Extramarital Affair: ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని..

Extramarital Affair: Wife Assassinated Husband In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. మురళికి పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృదుల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ దశలో ఉపాధి రీత్యా మురళి సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఇంటికి దూరంగా ఉంటున్న దశలో మృదులకు ఆమె నివాసం ఉంటున్న రిక్షా కాలనీలో శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని..

వీరిద్దరి మధ్య ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరికి శంకర్‌కి 18 ఏళ్లు నిండాయి. భర్త లేకపోవడంతో మృదుల శంకరతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. ఈ విషయం తెలిసి ప్రశ్నించిన మురళిపై వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ దశలో సెలవుపై ఈనెల తొమ్మిదో తేదీన మురళి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు.  భార్య నడవడికపై తొలి దశ నుంచి మురళికి అనుమానం ఉండటంతో కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందని చెప్పేవాడు. ఈనెల తొమ్మిదో తేదీన విశాఖ వచ్చిన మురళి 11వ తేదీన తల్లి వద్దకు వెళ్లాలని అనుకున్నాడు.

ఈ దశలో మృదుల  60 రోజుల పాటు భర్త మురళి విశాఖలో ఉంటారని తామిద్దరం కలిసే అవకాశం ఉండదని  శంకర్‌తో చెప్పింది. అంత కాలం దూరంగా ఉండలేమని హత్య చేస్తే జీవితకాలం కలిసి ఉండొచ్చని శంకర్ మృదులకు చెప్పాడు. ఆ ప్రకారం వీరిద్దరూ ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపేయాలని నిర్ణయించారు. అలా భర్త నిద్రపోతుండగా కుక్కర్‌తో తలపై చితకబాదింది. ప్రియుడు శంకర్‌ సహకరించాడు. వీరిద్దరూ కలిసి ప్రాణం పోయేంత వరకు మురళిని తీవ్రంగా కొట్టారు.

అనంతరం మృతదేహాన్ని మూటగట్టి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలస గడ్డలో స్కూటీపై వెళ్లి పడేశారు. రజకుల బట్టల మూటగా నమ్మించే రీతిన మృతదేహాన్ని దుప్పట్లో కట్టేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఓ రాత్రి ప్రియుడు మృదుల వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఇంటికి వస్తానన్న కొడుకు రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె ప్రశ్నించడంతో భర్త మురళి కనిపించడం లేదని పీఎం పాలెం పోలీసులకు మృదుల ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది

భర్త దూరంగా ఉండటంతో మృదుల వివాహేతర సంబంధం పెట్టుకుందని దీన్ని ప్రశ్నించగా తన కొడుకు పైనే కేసు పెట్టిందని మురళి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మురళిని అత్యంత దారుణంగా హతమార్చిన మృదుల, ప్రియుడు శంకర్‌లను ఉరితీయాలని కోరింది. సమాజం తలదించుకునే రీతిన వ్యవహరించిన వీరిద్దరికీ కఠిన శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top