బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య  | Another student commits suicide in Basara Triple IT | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య 

Apr 17 2024 4:54 AM | Updated on Apr 17 2024 4:54 AM

Another student commits suicide in Basara Triple IT - Sakshi

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్‌ హాస్టల్‌ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్‌కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్‌ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్‌..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. 

మృతికి కళాశాల యాజమాన్యమే కారణం 
తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్‌కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు.  

ఐదు నెలల్లో ముగ్గురు 
♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  
♦ 2023, నవంబర్‌ 25న నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.  ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది.  
♦ తాజాగా అరవింద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.  
♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్‌లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్‌లో విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు,  విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement