విషాదం: ‘మాఫ్‌ కర్‌దేనా గోపి భాయ్‌’ అంటూ చివరి సందేశం

3 Members Family Suicide In Hyderabad - Sakshi

అన్నదమ్ములు, సోదరి ఆత్మహత్య 

సాక్షి, చార్మినార్‌/దూద్‌బౌలి: ఆర్థిక ఇబ్బందులు ఒక కుటుంబాన్ని బలిగొన్నాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములతోపాటు సోదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పురానాపూల్‌లోని పార్ధివాడ ప్రాంతానికి చెందిన ఎల్‌ఐసీ ఉద్యోగి మధుసూదన్‌ (42), సోదరి ప్రేమలత (39), సోదరుడు సందీప్‌ (35) ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. వీరిలో ఎవరికీ వివాహం కాలేదు. భరించలేని అప్పుల బాధతో ఈ ముగ్గురు ఒకేసారి సొంతింట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి తల్లిదండ్రులు 15–20 ఏళ్ల క్రితమే మృతి చెందారు.

ఒకే మాటపై నిలబడే ఈ ముగ్గురు లక్షల రూపాయల అప్పు చేసి పార్ధివాడలో జీ ప్లస్‌–1 ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులిచ్చిన వారు వెంటపడుతుండటంతో నెల రోజులుగా ఇంటిని వదిలి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి పార్ధివాడకు చేరుకున్న వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జుమ్మెరాత్‌ బజార్‌లో ఉంటున్న తన స్నేహితుడు గోపిసింగ్‌కు మధుసూదన్‌ వాట్సాప్‌ సందేశం పంపించాడు.

‘మాఫ్‌ కర్‌దేనా గోపి భాయ్‌’అనే సందేశాన్ని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పంపాడు. అనంతరం ముగ్గురు కలిసి ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధుసూదన్‌ మెసేజ్‌ చూసిన గోపిసింగ్‌ తిరిగి ఫోన్‌ చేస్తుండగా... మధుసూదన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో పార్ధివాడకు చేరుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న బస్తీ నివాసి శశికిరణ్‌కు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కింటి గోడపైకి ఎక్కి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురు విగతజీవులై కనిపించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top