యువతితో వీడియో కాల్‌ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య | 22-year-old ends life over love failure in Dundigal | Sakshi
Sakshi News home page

యువతితో వీడియో కాల్‌ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య

Jun 22 2024 9:31 AM | Updated on Jun 22 2024 9:31 AM

22-year-old ends life over love failure in Dundigal

దుండిగల్‌: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్‌ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్‌(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. 

అతడు గండిమైసమ్మలోని గ్లాండ్‌ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్‌ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్‌ ఫోన్‌లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్‌ చివరిసారిగా ఓ యువతితో ఫోన్‌లో వీడియో కాల్‌ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్‌ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్‌ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement