తిరుపతి మంగళం : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న తమకు టైమ్ స్కేల్ మంజూరు చేయించాలని డైలీ వేజ్ ఉద్యోగులు కోరారు. బుధవారం తిరుపతిలోని కార్యాలయంలో ఎంపీ గురుమూర్తికి వినతిపత్రం సమర్పించారు. వర్సిటీలో మొత్తం 46 మంది ఎస్ఎంఆర్, డైలీ వేజ్ సిబ్బంది పనిచేస్తున్నామని తెలిపారు. అందులో కొంతమంది 2002 నుంచి సేవలు అందిస్తున్నారని, చివరిగా 2016 వరకు నియామకాలు జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని వాపోయారు. 2021లో తమను ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగినప్పుడు ఉద్యోగ భద్రతపై ఆందోళనతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ కేసులో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం టైమ్ స్కేల్ ఆఫ్ పే మంజూరు చేయాలని కోరుతూ 2023లో మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఇటీవల తమకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో టైమ్ స్కేల్ మంజూరు చేయించేందుకు సహకరించాలని కోరారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు, ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


