కార్వేటినగరం: విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా నాణ్యమైన బోధనలు చేయాలని జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం కార్వేటినగరం మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. పొన్నగల్లులో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కత్తెరపల్లి హెచ్డబ్ల్యూను సందర్శించి మనబడి– మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కత్తెరపల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రగతిపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పీఎంశ్రీ నిధులతో అభివృద్ధి చేసిన కిచెన్గార్డెన్ను చక్కగా నిర్వహిస్తున్న వాచ్మెన్ను అభినందించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, ఆర్వో సిస్టం తదితరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠఽశాలకు మూడు అదనపు గదులు, బయాలజీ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని హెచ్ఎం చంగల్రాజు ప్రతిపాదనలు సమర్పించారు. జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత శాతం లక్ష్యంగా బోధనలు కొనసాగాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు విజయకుమార్, మనో జ్కుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఉమాపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


