తొక్కుడు బిళ్లలు ఆడేవారు,
పేకాటరాయుళ్లకు ఉద్యోగాలా?
నిజాయితీగా 78 నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత జగనన్నది
మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి
వారధిగా నిలవాలి
అసత్యాలతో ప్రజలను
మభ్యపెట్టడం తగదు
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వం డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిందని, డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పుత్తూరులోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలు, అవినీతిని ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. వాటిని ఎల్లోమీడియా వక్రీకరించి రాయడం సబబుకాదని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో తమ బంధువులైన తొక్కుడు బిళ్లలు, పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన జాబితాలోని వారికి ఉద్యోగాలు కల్పించడమే నారాలోకేష్ నిజాయితీనా అని విమర్శించారు. మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పత్రికా విలువలను కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను అసెంబ్లీ సమావేశాల్లో ఎత్తి చూపడానికి ఎమ్మెల్యేలు ముందుకు రాకపోయినా ఎమ్మెల్సీలు నిలదీయడంపై నారాయణ స్వామి అభినందించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 78 నోటిఫికేషన్లు విడుదల చేశారని, ఏపీపీఎస్సీ ద్వారా 6,276 ఉద్యోగాలు, సచివాలయాల్లో 2.30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తమకు అన్యాయం జరిగిందని ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అసెంబ్లీలో కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల సమస్యల గురించి మాట్లాడడం లేదని, జగనన్నను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మీడియా మిత్రులు నిజాలను ప్రజలకు తెలియజేస్తే విలువలు ఉంటాయని తెలిపారు.
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు


